తప్పిన పెను అగ్నిప్రమాదం
తప్పిన పెను అగ్నిప్రమాదం
కాలిన కరెంటు వైర్లు, మోటార్ పైపులు
చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రమేష్ నాయక్
అక్షర దర్బార్,పరకాల:
పరకాల పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో పెట్రోల్బంక్ ఎదురుగా ఉన్న పంట భూముల్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించగా, స్థానిక ఎస్సై రమేష్ నాయక్ చాకచక్యంగా స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించారు.స్థానికుల వివరాల ప్రకారం.. భూమిలో పంట అవశేషాలను ఎవరో తగులబెట్టడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీపంలోని పొలాలకు అంటుకున్నాయి. దీంతో బావుల వద్ద ఉన్న కరెంటు వైర్లు, మోటార్ పైపులు దగ్ధమయ్యాయి. మంటలు ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కట్టే కోత యంత్రం (శామిల్ మిల్)వద్దకు చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు.
సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ నాయక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఎదురుగా ఉన్న బోర్ మోటార్ నుంచి పైపుల ద్వారా నీరు చల్లి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. స్థానికులను అప్రమత్తం చేసి బకెట్లు, బిందెలతో నీరు పోయించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో భారీ నష్టం తప్పినట్లు సామిల్ మిల్క్ యజమాని తెలిపారు.ఎస్సై రమేష్ నాయక్ చూపిన చొరవను స్థానికులు అభినందించారు.
పంట అవశేషాలు తగులబెట్టొద్దు
ఎస్సై రమేష్ నాయక్
పంటలు కోసిన తర్వాత మిగిలిన అవశేషాలను పొలాల్లో తగులబెట్టవద్దని ఎస్సై రమేష్ నాయక్ రైతులకు సూచించారు. ఇలా చేయడం వల్ల చుట్టుపక్కల పొలాలకు, ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అత్యవసరమైతే రైతులు దగ్గరుండి జాగ్రత్తలతో ఒకేచోట పేరబెట్టి నిర్వహించాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు