ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి
డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి
ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు
కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్
అక్షరదర్బార్, పరకాల :
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల జరిగిన ఘటనగా పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.