పీడీఎస్ రైస్ పట్టివేత
- 62 బస్తాల బియ్యం స్వాధీనం
- టాస్క్ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
పీడీఎస్ రైస్ పట్టివేత
- 62 బస్తాల బియ్యం స్వాధీనం
- టాస్క్ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
అక్షరదర్బార్, హనుమకొండ: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 62 బస్తాల్లో నిల్వ ఉన్న 31 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.1.08 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. టాస్క్ఫోర్స్కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హనుమకొండలోని గోపాలపూర్ గణేష్నగర్లో దాడి నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బండారి రాజ్కుమార్ (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పెద్దపల్లి జిల్లా కల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందినవాడని, ప్రస్తుతం గోపాలపూర్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, నిందితుడిని తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎ మధుసూదన్ తెలిపారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బండారి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.