భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత
- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం
- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి
భారీగా ‘హాష్ ఆయిల్’ పట్టివేత
- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం
- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి
అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన ‘హాష్ ఆయిల్’ (గంజాయి నూనె) స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2 కోట్ల 50 లక్షల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- నిందితుల వివరాలు
పోలీసుల కథనం ప్రకారం అరెస్టు అయిన వారిలో..
1. హంటల్ సన్ను (23) - ఒడిశా
2. హంటల్ సన్యాసి (23) - ఒడిశా
3. కండెల చిన్నబాబు (56) - ఆంధ్రప్రదేశ్ (అల్లూరి జిల్లా)
4. కృష్ణ హంటల్ (56) - ఒడిశా
ఈ కేసులో మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
- నేపథ్యం అరెస్టు జరిగిన తీరు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన గ్రామంలో గంజాయి మొక్కలను పెంచేవాడు. కేవలం గంజాయి అమ్మితే వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో, పరారీలో ఉన్న కిలో పాండు అనే వ్యక్తి సలహాతో గంజాయి మొక్కల నుండి ‘హాష్ ఆయిల్’ తయారు చేయడం ప్రారంభించారు. సుమారు 40 కిలోల ఆయిల్ను సేకరించగా, అందులో 20 కిలోల ఆయిల్ను ఐదు కిలోల చొప్పున ప్యాక్ చేసి ముంబాయిలో విక్రయించేందుకు నిందితులు ప్లాన్ చేశారు.
ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ నుండి కోనార్క్ ఎక్స్ప్రెస్లో బయలుదేరిన ఈ ముఠా, వరంగల్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు ఉంటాయన్న అనుమానంతో ఇక్కడే దిగిపోయారు. మంగళవారం ఉదయం ముంబాయి వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
- పోలీసు బృందానికి అభినందనలు
భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసిపిలు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ సతీష్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షూకూర్, వారి బృందాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.