కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు
- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్
- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం
కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు
- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్
- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం
అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ, కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నకిలీ పచ్చళ్ల దందాను మట్టుబెట్టి, ఒకరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
- ఇల్లే కేంద్రంగా అక్రమ వ్యాపారం
టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం... ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో అక్రమంగా పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బండారి రాజు, ఆర్ఎస్ఐ ఓ. భాను ప్రకాష్ మరియు సిబ్బంది ఆ గృహంపై ఆకస్మిక దాడి జరిపారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి ముడిసరుకులు, ప్రమాదకర రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ కుళ్లిపోయిన నిల్వలను చిన్న చిన్న ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి, స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
- భారీగా కుళ్లిపోయిన సరుకు స్వాధీనం
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన కాశీబుగ్గ నివాసి అరికెల శ్రీనివాస్ (51) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ కేంద్రం నుండి దాదాపు 2,100 కిలోల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 750 కిలోల టమోటా ముడిసరుకు, 900 కిలోల మామిడి ముక్కలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.2,25,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
"మార్కెట్లో లభించే బ్రాండ్ లేని, అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని కొని ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దు. నగరంలో ఎక్కడైనా ఇలాంటి అక్రమ నిల్వ కేంద్రాలు లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం." అని టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్ అన్నారు.