తీర్మానం లేకుండా నిధుల డ్రా..
తీర్మానం లేకుండా నిధుల డ్రా..
వార్డు సభ్యుల ఆగ్రహం
అక్షర దర్బార్, శాయంపేట:
గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ శాయంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శాయంపేట ఎంపీడీవోతో పాటు హనుమకొండ జిల్లా డీపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేయకుండా, వార్డు సభ్యుల సంతకాలు లేకుండానే సర్పంచి, ఉపసర్పంచి, కార్యదర్శి ఆధ్వర్యంలో నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వార్డు సభ్యులుగా ఉన్నప్పటికీ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలపై తమకు సమాచారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిధులు ఏ పనుల కోసం ఖర్చు చేశారనే వివరాలు అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై గ్రామపంచాయతీ తీర్మానం అనంతరం సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కూడా సర్పంచి ఏకపక్షంగా వ్యవహరించారని, తమ వార్డుల్లో అర్హులు ఉన్నప్పటికీ వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.