పరకాలలో ఒక్కసారిగా మంటలు
పరకాలలో ఒక్కసారిగా మంటలు
సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం
అక్షరదర్బార్, పరకాల:
పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కోసిన వరి గడ్డి, మొక్కజొన్న పంట అవశేషాలకు నిప్పంటించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్ వెంటనే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించడంతో వ్యవసాయ బావుల వద్ద ఉన్న కరెంటు మోటార్లు, పైపులు, బట్ట పైపులు దగ్ధమయ్యాయి. మంటలు సమీపంలోని మామిడి తోటతో పాటు ఇండియన్ గ్యాస్ గోదాం వరకు వ్యాపించే ప్రమాదం నెలకొనగా సీఐ క్రాంతికుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ నష్టం తప్పించారు.దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తీవ్ర ఎండల కారణంగా గడ్డి పూర్తిగా ఎండిపోయి ఉంటుందని, రైతులు పంట అవశేషాలను కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.