కేటుగాళ్ల నల్ల దందా
- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు
- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు
- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ
- రూ. 28 లక్షల విలువైన సామాగ్రి, నగదు స్వాధీనం
అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న, రసాయనాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న భారీ ముఠాను వరంగల్ టాస్క్ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిఊ వద్ద నుండి రూ.1,48,000 నగదు, రెండు కార్లు, 13 సెల్ ఫోన్లు, సుమారు రూ. 28 లక్షల విలువైన ల్యాప్టాప్లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితులు రెండు గ్రూపులుగా విడిపోయి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ల్యాప్టాప్, కలర్ ప్రింటర్లను ఉపయోగించి రూ.100 నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నారు. మిగిలిన ఐదుగురు వ్యక్తులు 1:3 నిష్పత్తిలో (ఒక్క రూపాయికి మూడు రూపాయలు) డబ్బు ఇస్తామని నమ్మిస్తారు. ఇందుకోసం వారు అసలైన రూ.500 నోటును అయోడిన్ టింక్చర్ ద్రావణంలో ముంచి నల్లగా మారుస్తారు. తిరిగి దానిపై 'హైపో' (సోడియం థయోసల్ఫేట్) పోయగానే అది పాత రూపానికి వస్తుంది. ఇది చూసి నమ్మిన బాధితులకు నల్ల కాగితాల కట్టలను ఇచ్చి, అసలు నగదుతో పరారవుతారు.
- నిందితుల వివరాలు
పోలీసుల కథనం ప్రకారం అరెస్టయిన వారిలో శాగంటి కిరణ్ (నర్సంపేట), నీరటి శివ (నర్సంపేట), నీరటి రంజిత్ (నర్సంపేట), గుడికందుల రవి (నర్సంపేట), పోరిక రాజ్కుమార్ @ రాజు (ఘన్పూర్, ములుగు), తనమాల రాజశేఖర్ (ఖమ్మం), ముదురుకోల యాకంబరం (భువనగిరి), చేను సాయికిరణ్ (కొత్తగూడెం) ఉన్నారు.
- పాత నేరస్థులే..
ఈ ముఠా గతంలో ఘన్పూర్, సికింద్రాబాద్ (మోండా మార్కెట్), ఖమ్మం, కొత్తగూడెం, కేయూసీ, సుబేదారీ పరిధిలో అనేక మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్లోని ఛత్రినాక, నర్సంపేటలలోనూ ఇవే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
సాహసోపేతంగా ఈ ముఠాను పట్టుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూధన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు బాబులాల్, శ్రీనివాస్, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ (సీపీ) ప్రత్యేకంగా అభినందించారు.
