భర్త హత్యకు భార్య స్కెచ్
- రూ.4 లక్షల సుపారీ
- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన
- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ
- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్
భర్త హత్యకు భార్య స్కెచ్
- రూ.4 లక్షల సుపారీ
- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన
- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ
- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్
అక్షరదర్బార్, మహబూబాబాద్:
మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన మాజీ ఉప సర్పంచ్ యాకయ్య (57) హత్య కేసును మహబూబాబాద్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. భర్తను అంతమొందించేందుకు రూ.4 లక్షల సుపారీ మాట్లాడిన భార్య యశోద (53)తో పాటు హత్యకు పాల్పడిన మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శబరిష్ ఈ సంచలన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
- పరాయి మహిళకు ఆస్తి ఇస్తాడనే భయంతోనే..
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు యాకయ్యకు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన ఆస్తిని ఆ మహిళకు ఎక్కడ రాసిస్తాడోననే భయం భార్య యశోదలో మొదలైంది. దీంతో భర్తను పూర్తిగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, యాకయ్యను హత్య చేసేందుకు రూ.4 లక్షల సుపారీని మాట్లాడి నిందితులతో ఒప్పందం కుదుర్చుకుంది.
- దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం ఫెయిల్..
పథకం ప్రకారం.. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున దుండగులు యాకయ్యపై ఇనుప రాడ్తో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం ఇదంతా దొంగల పనిగా చిత్రీకరించేందుకు యాకయ్య మెడలోని బంగారు గొలుసును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రంగంలోకి దిగిన టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టి అసలు సూత్రధారి భార్య యశోదనే అని గుర్తించారు.
- సామగ్రి సీజ్.. పోలీసులకు అభినందనలు
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్య యశోదతో పాటు మరో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 7 సెల్ఫోన్లు, ఒక ఐరన్ రాడ్, 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి మెడ నుంచి దొంగిలించిన 1 బంగారు గొలుసును పోలీసులు సీజ్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన టౌన్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ శబరిష్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.