పరకాలకు పారిశుధ్య ముప్పు
పరకాలకు పారిశుధ్య ముప్పు
వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..
స్వైర విహారం చేస్తున్న పందులు..
దుర్వాసనతో ప్రజల అవస్థలు..
అక్షరదర్బార్,పరకాల:
వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 22 వార్డుల్లో అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పందులు గుంపులుగా తిరుగుతున్నాయని, అక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వర్షాల కారణంగా చెత్త నుంచి దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్తను సకాలంలో తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.