రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు
రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు
- కొండా సుస్మిత పటేల్ తీరుపై కాంగ్రెస్ నేతల మండిపాటు..
- క్షమాపణ చెప్పాలని డిమాండ్
- ఇక్కడ మంత్రి సుష్మతనా ...సురేఖా.!
- ధర్మారెడ్డికి భయపడి వరంగల్ పారిపోయారు
- గీసుకొండ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భీమగాని సౌజన్య
అక్షరదర్బార్, పరకాల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై కొండ సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం గీసుకొండ మండల కేంద్రంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.
నాగారం మాజీ సర్పంచ్ కట్కూరి స్రవంతి మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో పాటు మహిళలకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలను క్షమించినప్పటికీ, మరోసారి మాట్లాడటం ద్వారా ఆమెపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారని అన్నారు. సుస్మిత పటేల్కు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదని పేర్కొన్నారు.
పరకాల మాజీ జెడ్పీటీసీ పాడి కల్పన మాట్లాడుతూ.. “పరకాల ఎవరి అడ్డా కాదు.. ప్రజల అడ్డా” అని అన్నారు. 2012లోనే కొండా సురేఖ పరకాలకు దూరమయ్యారని, అలాంటి కుటుంబం నుంచి సుస్మిత పటేల్ సీఎం, ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదన్నారు. భాషను మార్చుకుని నాయకురాలిగా ఎదగాలని హితవు పలికారు.
గీసుకొండ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకురాలు భీమగాని సౌజన్య మాట్లాడుతూ.. “ఇక్కడ మంత్రి సురేఖనా.. సుస్మితనా?” అని ప్రశ్నించారు. పరకాలలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న సభకు భారీగా ప్రజలు తరలిరావడం, పరకాల అభివృద్ధికి సీఎం ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. పరకాల అభివృద్ధి కోసం రేవూరి ప్రకాశ్రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని సీఎం కోరడాన్ని సుస్మిత పటేల్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
చల్లా ధర్మారెడ్డికి భయపడి కొండా సురేఖ కుటుంబం పరకాల నుంచి దూరంగా వెళ్లిందంటూ సౌజన్య వ్యాఖ్యానించారు. గీసుకొండలో జరిగే జన్మదిన వేడుకలు, బోనాలు, కొమ్మాల జాతర వంటి కార్యక్రమాలకు వచ్చి సుస్మిత పటేల్ ఏదో ఒకటి మాట్లాడటం ద్వారా మంత్రి కొండా సురేఖకు రాజకీయంగా నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో వివాదాలకు దారితీసేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
కాంగ్రెస్ అధిష్ఠానం రేవూరి ప్రకాశ్రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ శ్రేణులంతా ఆయన విజయానికి కృషి చేస్తారని సౌజన్య అన్నారు. స్వతంత్రంగా పోటీ చేయాలని భావిస్తున్న సుస్మిత పటేల్ ఇకపై కాంగ్రెస్ నాయకుల ఫొటోలను ఉపయోగించుకోవద్దని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించవద్దని హితవు పలికారు. చేసిన వ్యాఖ్యలకు సీఎం, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కార్యకర్తలు సహించబోరని నాయకులు హెచ్చరించారు.