తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!
పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..
పరస్పరం ఆరోపణలు..
పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్
అక్షరదర్బార్, నడికూడ:
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా భావించే ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా నడికూడ మండలం వరికోలు ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటుచేసుకుంది. పీఎం శ్రీ పథకం నిధుల ఖర్చుపై మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులు పరస్పరం వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తల్లిదండ్రుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
పీఎం శ్రీ నిధుల ఖర్చుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్, పాలకవర్గానికి సమాచారం ఇవ్వకుండా, తమకు అనుకూలంగా ఉన్న కొందరు తల్లిదండ్రులను మాత్రమే పిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమావేశంలో నిధుల వినియోగం, పంపకాల అంశంపై ఉపాధ్యాయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.
గతంలోనూ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు
పాఠశాల నిధుల వ్యవహారంపై గతంలోనూ వివాదాలు తలెత్తినట్లు సమాచారం. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ఫోర్జరీ సంతకాలతో నిధులు దుర్వినియోగం చేశారంటూ కొందరు ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పీఎంసీ నిధుల వినియోగంలోనూ అవకతవకలు జరిగాయంటూ మండల, జిల్లా విద్యాధికారులకు గతంలో ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
మంగళవారం మరోసారి వివాదం
చోటుచేసుకోవడంతో ప్రధానోపాధ్యాయుడు శరత్ ఉపాధ్యాయుడు అశోక్పై పరకాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పాఠశాల నిధుల వినియోగంపై నెలకొన్న వివాదంపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.