లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి
- భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం
- దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం
లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి
- భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం
అక్షరదర్బార్, భూపాలపల్లిక్రైమ్:
గణపురం మండలం చెల్పూర్ వద్ద భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై గల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయం ముందు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్న బొగ్గు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీవో వెంకన్న పైనుంచి దూసుకు వెళ్లింది. నడుముపై నుంచి వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీవో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారిగా పేరున్న వెంకన్న మృతి పట్ల జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీవో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న ఇటీవలే ఈనెల 4న జగిత్యాల నుంచి బదిలీపై భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా వచ్చారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.