గంజాయి చాక్లెట్ల కలకలం
- ఒడిశా కేటుగాడి అరెస్ట్
- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..
- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
గంజాయి చాక్లెట్ల కలకలం
- ఒడిశా కేటుగాడి అరెస్ట్
- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..
- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి చాక్లెట్ల అక్రమ రవాణాను రట్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) ఎస్ శివకృష్ణ తన సిబ్బంది డి నాగరాజు, బి సత్యనారాయణ, పి రవిలతో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎంజీఎం సర్కిల్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న నలుపు రంగు బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బ్యాగులో చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పదార్థం బయటపడటంతో పోలీసులు షాక్కు గురయ్యారు.
- ఒడిశా టు మహారాష్ట్ర.. వరంగల్ మీదుగా స్మగ్లింగ్
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లా, కాన్పాడా గ్రామానికి చెందిన జనార్ధన్ మాలిక్ (వయస్సు 35 ఏళ్లు) గా గుర్తించారు. నిందితుడి వద్ద నిషేధిత పదార్థం దొరకడంతో మట్వాడ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు పంచులు (సాక్షులు), క్లూస్ టీంను సంఘటనా స్థలానికి రప్పించి చట్టపరమైన ప్రక్రియను చేపట్టారు.
పంచుల సమక్షంలో నిందితుడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తన పరిచయస్తుడు అంకిత్ పాణిగ్రహి వద్ద నుండి ఈ గంజాయి మిశ్రమ చాక్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేశానని.. వీటిని మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురాశతో తీసుకెళ్తున్నట్లు నిందితుడు స్వచ్ఛందంగా అంగీకరించాడు.
- ఘాటైన వాసన.. 'క్యానబిస్ సటైవా' గుర్తింపు
నిందితుడి వద్ద లభించిన గోల్డ్ కలర్ కవర్లపై “Seven Minor Vati” అని ముద్రించి ఉంది. పోలీసులు మొత్తం 72 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కవర్లపై ఉన్న వివరాలను పరిశీలించగా.. అందులో ‘క్యానబిస్ సటైవా’ (గంజాయి) సహా పలు మత్తు పదార్థాలు కలిపి తయారు చేసినట్లు నిర్ధారణ అయింది. పంచులు, పోలీసుల సమక్షంలో వాటిని పరిశీలించగా చాక్లెట్ల నుండి గంజాయికి ఉండే ప్రత్యేకమైన ఘాటైన వాసన రావడంతో వాటిని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న మట్వాడ ఎస్ఐ శివకృష్ణ, పీసీలు నాగరాజు, సత్యనారాయణ, రవిలను ఉన్నతాధికారులు అభినందించారు.