వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు
ట్యాబ్లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన
ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు
అక్షరదర్బార్, శాయంపేట:
వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల రాక సమీపిస్తున్న నేపథ్యంలో సాగు సన్నాహకాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతిలో నగదు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము సమయానికి అందకపోవడం వల్ల వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు.
అధికారులు స్పందించాలంటున్న రైతులు
ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల రికార్డులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలు వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెండింగ్లో ఉన్న చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.