సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం
- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా
- బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం
- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా
- బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
అక్షరదర్బార్, హనుమకొండ: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనను నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ కాంగ్రెస్ భవన్ కూడలి వద్ద భారీ ధర్నా నిర్వహించారు. హనుమకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని, బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ తన కుమారుడు చేసిన అకృత్యానికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ప్రధాని మోదీ ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని అన్నారు. సాధారణ పౌరులపై పోక్సో కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేసే పోలీసులు, కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టే విచారణలో జాప్యం చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నంత కాలం పోలీసులపై ఒత్తిడి ఉంటుందని, బాధితురాలికి న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.'బేటీ బచావో - బేటీ పడావో' అనేది బీజేపీకి కేవలం ఎన్నికల నినాదమే తప్ప, ఆచరణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అత్యాచార, వేధింపుల కేసులు ఉన్నా పార్టీ వారికి రక్షణ కల్పిస్తోందని ధ్వజమెత్తారు. వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసే స్థాయికి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని, నిందితుడు సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అధికారం అండతో చట్టాన్ని చుట్టంలా మార్చుకోవాలని చూస్తే మహిళా కాంగ్రెస్ ఊరుకోదని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎర్రబెల్లి స్వర్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు.