మహిళా ఉద్యోగులకు వేధింపులు
మహిళా ఉద్యోగులకు వేధింపులు
- ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం
- ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం
అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్లోని ఓ ఉన్నతాధికారిపై మహిళా ఉద్యోగులు వేధింపుల ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కింద పనిచేసే మహిళా సిబ్బందితో సదరు ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొందరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము పనిచేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ పనిచేయడం కంటే సెలవులు తీసుకోవడమే మేలని కొందరు మహిళా ఉద్యోగులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
సదరు అధికారి వద్ద పనిచేయడానికి భద్రతాభావం లేకపోవడంతో పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. అవసరమైతే సంబంధిత అధికారిని బదిలీ చేయాలని, లేదంటే మహిళా ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా బదిలీలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.