పోలీసుల దాడి!
ఆస్పత్రి నుంచి రాగానే.. పోలీసుల దాడి!
బాధితునికి తీవ్ర గాయాలు
బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
వరంగల్ సీపీ జోక్యం చేసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం రాయపర్తి గ్రామానికి చెందిన ఆల్లె సందీప్పై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన సందీప్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం గురువారం ఉదయం గ్రామానికి వచ్చాడు. అయితే పరకాల పోలీసులు అతడిని ఎక్కడికి వెళ్లావంటూ ప్రశ్నించి.. మళ్లీ తీవ్రంగా కొట్టారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. పోలీసుల దాడిలో సందీప్ తీవ్రంగా గాయపడి పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ ఎక్కడ?
చికిత్స పొందుతున్న సందీప్ను పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ వ్యవస్థ ఉండేదన్నారు. గ్రామాల్లో గొడవలు జరిగినప్పుడు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడి సమస్యను పరిష్కరించే విధానం ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలీసుల వ్యవహారశైలి మారిపోయిందని, గుండాయిజం తరహాలో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
మెరుగైన వైద్యం అందించాలి
సందీప్ పరిస్థితి విషమంగా ఉందని ధర్మారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించి అతడిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
వరంగల్ సీపీకి మంచి పేరు ఉందని, ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. బాధితుడు సందీప్కు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.