రూ.1.25 కోట్ల గంజాయి సీజ్
- అంతర్రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్
- దామెర పోలీసుల భారీ ఆపరేషన్
- 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్ఫోన్ స్వాధీనం
- వరంగల్ సీపీ ఎన్ శ్వేత వెల్లడి
రూ.1.25 కోట్ల గంజాయి సీజ్
- అంతర్రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్
- దామెర పోలీసుల భారీ ఆపరేషన్
- 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్ఫోన్ స్వాధీనం
- వరంగల్ సీపీ ఎన్ శ్వేత వెల్లడి
అక్షరదర్బార్, హనుమకొండ: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ముదిగొండ నాగేశ్వర్ రావు (55)ను దామెర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.1 కోటి 25 లక్షల విలువైన 251 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ. 9,000 నగదు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మీడియా సమావేశంలో వెల్లడించారు.
- ఇతర రాష్ట్రాలకు రవాణా
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో దామెర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నాగేశ్వర్ రావు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత తనకున్న నెట్వర్క్ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్, అక్లీం, షారుఖ్ ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజు అనే వ్యక్తుల ద్వారా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఇచ్చిన పక్కా సమాచారంతో అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు భారీగా నిల్వ ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతం నుంచి పులుకుర్తికి రవాణా అయింది. ఈ గంజాయి నెట్వర్క్తో సంబంధం ఉన్న మిగతా రాష్ట్రాల నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు.
- మత్తు పదార్థాలపై కఠిన చర్యలు
యువత మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకుండా కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించామని సీపీ ఎన్.శ్వేత తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- పోలీస్ సిబ్బందికి అభినందనలు
ఈ భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ సీఐ సంతోష్, దామెర ఎస్ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్ఐ పరమేశ్వర్, పరకాల ఎస్ఐ రఘుపతి, ఏఏఓ సల్మాన్ పాషా మరియు దామెర, శాయంపేట స్టేషన్ల కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.