ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!
గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..
చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష
అక్షరదర్బార్,నడికూడ
నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై వివాదం రాజుకుంటోంది. గ్రానైట్ తవ్వకాల పేరుతో గుట్టను ధ్వంసం చేసి, అందులో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్న పురాతన ఆనవాళ్లు, నిధులను కొల్లగొట్టేందుకు ఓ బడా కాంట్రాక్టర్ ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. గుట్టపై కాంట్రాక్టర్ కన్ను పడటం వెనుక అసలు ఉద్దేశం గ్రానైట్ తవ్వకాలేనా.. లేక గుప్తనిధుల కోసమా? అంటూ గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గుట్టపై శివాలయం, మడేల్లయ్య ఆలయం, అనంత పద్మస్వామి ఆలయ ఆనవాళ్లు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా గుట్టపై తొమ్మిది దొనలు ఉన్నాయని, వాటిలో వజ్ర వైఢూర్యాలు వంటి విలువైన వస్తువులు ఉన్నట్లు పూర్వీకుల నుంచి కథనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. దీంతో ఈ గుట్టను మరో అనంతనాభస్వామి ఆలయంగా గ్రామస్తులు అభివర్ణిస్తున్నారు.
పరిరక్షణకు జేఏసీ
గుట్టను కాపాడుకునేందుకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, గ్రామస్తులు కలిసి చాకిరేవు గుట్ట పరిరక్షణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డారు. గత కొన్ని రోజులుగా గుట్ట పరిరక్షణ కోసం నిరాహార దీక్షలు చేపడుతున్నారు. గుట్ట తమ గ్రామానికి ప్రతిరూపమని, దాని ఉనికిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు.
తవ్వకాలు నిలిపివేయాలి
చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నట్లు చెబుతున్న చాకిరేవు గుట్టను గ్రానైట్ తవ్వకాల పేరుతో ధ్వంసం చేయడం సరికాదని గ్రామస్తులు అంటున్నారు. గుట్టపై తవ్వకాలకు సంబంధించిన ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి గుట్టపై సమగ్రంగా పరిశీలన జరిపి, పురాతన ఆనవాళ్లు, ఆలయాలు, గుట్ట సహజ స్వరూపాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.