మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్!
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్!
కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..
12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం
అక్షరదర్బార్, పరకాల:
పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట మధ్యాహ్నం దొంగలు హల్చల్ చేయడం కలకలం రేపింది. పరకాల పట్టణంలోని మెయిన్రోడ్డులో ఉన్న ఓ కిరాణా దుకాణం యజమాని ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు 12 తులాల బంగారంతో పాటు రెండు జతల వెండి పట్టీలు అపహరించినట్లు ఇంటి యజమాని ముక్క ప్రకాశం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిరాణా దుకాణం యజమాని, కుటుంబ సభ్యులు మాసికానికి వెళ్లి తిరిగి వచ్చే సమయానికి ఇంటి వెనుక కిటికీ తెరిచి కనిపించింది. అనుమానం వచ్చిన వారు ఇంట్లో పరిశీలించగా బీరువాలో ఉంచిన బంగారం, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పరకాల పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చోరీ జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఇదే దుకాణంలో గతంలోనూ సుమారు రూ.3 వేల నగదు చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. తాజా ఘటనతో దొంగతనానికి పాల్పడింది పరిచయం ఉన్న వ్యక్తులేనా? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.