చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్కు అనుమతులెలా?
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్కు అనుమతులెలా?
అసైన్డ్ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్రావు ప్రశ్న
అక్షరదర్బార్, పరకాల
నడికూడ మండలంలోని కంటాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై మైనింగ్కు అనుమతులు ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. కాళీ ప్రసాద్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన జాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చాకి రేవు గుట్ట పరిసరాల్లోని 717/28 సర్వే నంబర్లో సుమారు 12 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని తెలిపారు. అందులో సుమారు ఐదు ఎకరాల గుట్టకు కాంట్రాక్టర్ అనుమతులు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గుట్టపై తవ్వకాలు జరిగితే తాళ్లతో జీవనం సాగించే సుమారు 200 కుటుంబాలతోపాటు ముదిరాజుల జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అసైన్డ్ భూముల్లో మైనింగ్కు మైనింగ్ శాఖ ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చిందో పరిశీలించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి
చాకిరేవు గుట్ట ప్రాంతాన్ని నడికూడ జాక్ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని డా. కాళీ ప్రసాద్రావు కోరారు. కాకతీయుల కాలం నాటి నిర్మాణాలకు సంబంధించిన ఆనవాళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. రజకుల మండేలయ్య, పురాతన శివాలయం వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని, నిధుల కోసం తవ్విన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన ‘మాటు’ ఇప్పటికీ రైతులకు సాగునీరు అందించేందుకు ఉపయోగపడుతోందని తెలిపారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని సంరక్షించడంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమ మైనింగ్ తవ్వకాలపై జాక్ ద్వారా పోరాటం చేస్తామని డా. కాళీ ప్రసాద్రావు తెలిపారు.