ఈత సరదా ప్రాణం తీసింది..
చలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు
హెచ్చరికలు లెక్కచేయని యువకులు
అక్షరదర్బార్, శాయంపేట:
శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కాలువలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గీసుకొండ మండలం మనుగొండకు చెందిన మధ్యబోయిన వెంకన్న (35) పత్తిపాక గ్రామంలో జరిగిన మధ్యబోయిన మొగిలి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం బంధువులతో కలిసి చలివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాలువలో ఈతకు దిగగా అదుపుతప్పి గల్లంతైనట్లు తెలిసింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ప్రాజెక్టు పరిసరాల్లో ఈతకు వెళ్లవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.