బావిలో ముగ్గురు మృతి
- పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు
- ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి
- మరొకరికి తీవ్ర గాయాలు
- కొరికిశాల గ్రామంలో విషాదం
క్రేన్ వైరు తెగి
బావిలో ముగ్గురు మృతి
- మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో ఘటన
అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తెగి పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కొరికిశాల గ్రామానికి చెందిన దేవారావు(48), అభిలాష్(16), పిడిసిల్ల గ్రామస్తుడు పైడయ్య(53)గా గుర్తించారు. సుకినె మోహన్ రావు గాయపడ్డారు. ఈ నలుగురు శనివారం మధ్యాహ్నం వ్యవసాయ బావిలో ఉన్న సమయంలో పూడికతీత పనిలో ఉన్న క్రేన్ వైరు తెగి బావిలో పడిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా గాయపడిన మోహన్ రావు ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బావిలో నుంచి ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వేసవి దృష్ట్యా సాగు నీటి కోసం వ్యవసాయ బావిలో నుంచి పూడిక తీసే పనులు చేపట్టగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.