పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’
పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’
అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త హత్య..
చలువాయి వద్ద శవం ఆనవాళ్లు?
పోలీసులు దర్యాప్తు ముమ్మరం
అక్షరదర్బార్, పరకాల:
పరకాల పట్టణంలో భార్య చేత భర్త హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ (30) ట్రాక్టర్ మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య లావణ్యకు నరేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3న సుమన్ను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లిన లావణ్య, తదుపరి రోజు అతని సెల్ఫోన్ ద్వారా బ్రతికున్నట్లుగా స్టేటస్ పెట్టినట్లు తెలిసింది. అయితే ఏప్రిల్ 6న ఏమి తెలియనట్లుగా ఇంటికి చేరుకోవడంతో మృతుడి తండ్రి సాంబయ్యకు అనుమానం కలిగింది. దీంతో ఏప్రిల్ 8న పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
గతంలో కూడా రెండు సార్లు హత్యకు ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. చివరగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చలువాయి ప్రాంతంలో హత్య జరిగినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. హత్య అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసినట్లు కూడా తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టగా, బుధవారం లావణ్య తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేయించిన ఈ ఘటన పరకాలను ఒక్కసారిగా కుదిపేసింది. ఈ హత్యలో మరెవరెవరు భాగస్వామ్యం ఉన్నారో, మహిళతో వారి సంబంధం ఏమిటన్న దానిపై పట్టణంలో చర్చలు సాగుతున్నాయి. ఎక్కడో జరిగే ఘటనలు తమ ప్రాంతంలోనే జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.