బర్త్ డే వేడుకల్లో విషాదం
- స్విమ్మింగ్ పూల్ లో పడి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి
- హనుమకొండ జిల్లాలో ఘటన
బర్త్ డే వేడుకల్లో విషాదం
- ఈతకోలనులో పడి తల్లీ, ఇద్దరు కుమార్తెల మృతి
అక్షరదర్బార్, ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో బుధవారం రాత్రి గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. కన్నబిడ్డ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని ఆ కుటుంబం పున్నేలులోని ఓ ఫామ్హౌస్కు చేరుకుంది. కేక్ కట్ చేసి, విందు భోజనం ముగించి అంతా ఆనందంగా గడుపుతున్న సమయంలో విధి వంచించింది. అప్పటివరకు కేరింతలతో సాగిన ఆ వేడుక నిమిషాల్లోనే కన్నీటి సముద్రంగా మారింది. పున్నేలు గ్రామానికి చెందిన ఫర్హత్ (26), తన పెద్ద కుమార్తె ఉమేరా (8) పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక రిసార్ట్కు వెళ్లారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత సరదాగా సమయం గడిపేందుకు అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు.
దురదృష్టవశాత్తు ఆయేషా (7), ఉమేరా (8) ప్రమాదవశాత్తు ఈతకొలనులో పడిపోయారు. వారిని రక్షించే క్రమంలో తల్లి ఫర్హత్ కూడా పూల్లోకి దిగి నీట మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
- గ్రామంలో విషాద ఛాయలు
సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుక ఇలా సామూహిక మరణాలకు దారితీయడంతో పన్నేలు గ్రామం ఉలిక్కిపడింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు ఆడపిల్లలతో పాటు తల్లి కూడా మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.