శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం.
శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం
కొత్త భవనం, డిజిటల్ సౌకర్యాల కోసం విద్యార్థుల వినతి
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రేవూరి
అక్షరదర్బార్, పరకాల:
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. పాత భవనం కావడంతో పైకప్పు పెచ్చులు ఊడిపడుతూ ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం నెలకొంది. రోజుకు సుమారు 300 మందికిపైగా పాఠకులు వినియోగిస్తున్న ఈ గ్రంథాలయానికి సరైన సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది.
కొత్త భవనం నిర్మించాలని గతంలో పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పరిష్కారం లేకపోవడంతో మంగళవారం విద్యార్థులు, నిరుద్యోగులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిశారు. బొచ్చు రాజు స్వేరో ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి గ్రంథాలయాన్ని పాత మున్సిపల్ కార్యాలయానికి తరలించాలని కోరారు.దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పాత మున్సిపల్ కార్యాలయంలో డిజిటల్ లైబ్రరీ, వైఫై సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు, నిరుద్యోగులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.పోటీ పరీక్షలకు అనుగుణంగా కొత్త పుస్తకాలు అందుబాటులోకి తేవాలని, శాశ్వతంగా ఆధునిక గ్రంథాలయ భవనం నిర్మించాలని పాఠకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.