టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
- నాలుగు వాహనాలు సీజ్
- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ
అక్షరదర్బార్, భూపాలపల్లి క్రైమ్; పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిన ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాను సివిల్ సప్లై, టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం రాత్రి సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. నాలుగు వాహనాల్లో తరలిస్తున్న 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు నేతృత్వంలో స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజుల నుండి కొందరు అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది గత కొన్ని రోజుల నుంచి పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై గట్టి "నిఘా" పెట్టారు. ఇందులో భాగంగా నాలుగు వాహనాల్లో రేషన్ బియ్యం తరలిపోతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా నాలుగు వాహనాల్లో అక్రమంగా రవాణా జరుగుతున్న 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని రంగయ్యపల్లె గ్రామ శివారులోని మారుతి రైస్ మిల్ లో భద్రపరిచి నాలుగు వాహనాలను రేగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ అడిషనల్ సూపరిండెంట్ ప్రభాకర్ రావు, సీఐ వసంత కుమార్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సివిల్ సప్లై అధికారులు పి సురేందర్ రెడ్డి, రాజు, వేణు. తదితరులు పాల్గొన్నారు, పట్టుబడిన ఈ రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి, వీటిని తరలిస్తున్నది ఎవరు?, ఎక్కడినుంచి తీసుకెళ్తున్నారనే సమాచారాన్ని తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి 97 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశమైంది.