పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!
- వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన
అక్షరదర్బార్, పరకాల:
పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత ఆహారానికి అడ్డాగా మారుతున్నాయి. నడికూడ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడీ సెంటర్లకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా సరఫరా అవుతున్న భోజన నాణ్యతపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం, పిల్లలకు “పప్పు, సాంబార్, కూర” పేరుతో అందిస్తున్న ఆహారం వాస్తవానికి నీళ్లు కలిపిన పప్పు, నీళ్లు మసాలాతో కలిపిన సాంబార్ రూపంలో ఉందని వారు ఆరోపిస్తున్నారు. బాలింతలు, చిన్నారులు తినే స్థితిలో కూడా ఆ భోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీకి పంపడం మానేశారు.“పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలనుకున్న ప్రభుత్వం ఉద్దేశం వక్రీకృతమవుతోంది. ఈ పరిస్థితిని అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలి” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమదేవరపల్లి ప్రాజెక్టు అంబాల సెక్టర్ పరిధిలో ఉండే ఈ అంగన్వాడీ కేంద్రాలపై జిల్లా అధికారుల దృష్టి నిలిచింది. జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి, అంగన్వాడీల్లో అందిస్తున్న ఆహార నాణ్యతపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.