
రైతులకు అండగా బీఆర్ఎస్ .
- ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"
- రైతులపై కేసులు వద్దు.
- పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.
అక్షరదర్బార్, పరకాల:
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత మాటలకు మోసపోయిన రైతులు ఇప్పుడు గోస పడుతున్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు పూర్తి అండగా నిలుస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ఎస్ జె గార్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా, గురువారం మృతి చెందిన పరకాల మాజీ జడ్పీటీసీ సభ్యుడు సీలువేరు మొగిలి మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులు ఆనందం చేకూర్చాయి. అయితే, కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు రైతులు యూరియా కొరతతో రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది," అన్నారు.
"ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"
పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు బదులుగా ఆయన పీఏ అధికారం చలాయిస్తున్నారని ధర్మారెడ్డి ఆరోపించారు. "ప్రభుత్వ అధికారులను బెదిరించడం, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం వంటి చర్యలు అతను తీసుకుంటున్నాడు. ప్రజలతో సంబంధం లేని వ్యక్తి ఇంత అధికారాన్ని ఎలా కలిగి ఉన్నాడో ప్రజలకు తెలియాలి," అని ధర్మారెడ్డి ప్రశ్నించారు.
- యూరియా అందక రైతుల గోస – ఎమ్మెల్యేపై ప్రజల ఆగ్రహం
రైతులకు తగినంత యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన, పరకాల నియోజకవర్గంలో రైతులు రెండురోజులుగా ధర్నాలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "రైతులు యూరియా కోసం పోరాడుతుంటే, వారిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని మేము సహించం. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేపై ఉద్యమానికి సిద్ధంగా ఉంటాం," అని హెచ్చరించారు.
- రైతులపై కేసులు వద్దు – బీఆర్ఎస్ మద్దతు
"రైతులపై అక్రమ కేసులు పెట్టొద్దు. ప్రభుత్వం వారి పక్షంలో ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది," అని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.