చైర్మన్ గా కొమురయ్య
- వైస్ చైర్మన్ గా శ్రీనివాస్
- భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
అక్షరదర్బార్, భూపాలపల్లి: ఊహించినట్లుగానే భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సునాయాసంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బుర్ర కొమురయ్య గౌడ్ చైర్మెన్ గా, అంబాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 16 వార్డులను కాంగ్రెస్ గెలుచుకోగా, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, సిపిఐ ఒకటి, స్వతంత్రులు ఒకటి గెలుచుకున్న విషయం తెలిసిందే. 16 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు సిపిఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం భూపాలపల్లి మున్సిపాలిటీలో 18 కి పెరిగింది. సోమవారం భూపాలపల్లిలోని మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు మొదట కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిపారు. ఎన్నికల్లో చైర్మన్ గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రతిపాదన మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైన బుర్ర కొమురయ్య గౌడ్ మొదటి నుంచి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు వెన్నంటి ఉన్నారని సమాచారం. చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో బీఆర్ హ్యాట్రిక్ మిస్ అయింది. గతంలో వరుసగా రెండుసార్లు ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ దక్కించుకుంది.