ఆరబెట్టిన మిర్చి చోరీ
- 5 క్వింటాళ్ల మిర్చి అపహరణ
- విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు
- హనుమకొండ జిల్లాలో ఘటన
బావి వద్ద అరబెట్టిన మిర్చి మాయం..
మల్లక్కపేట–నాగారం శివారులో చోరీ…
పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అక్షరదర్బార్, పరకాల:
హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట–నాగారం గ్రామాల శివారులో రైతు అరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని దొంగలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి బాబు అనే రైతు తన మిర్చిని బావి వద్ద అరబెట్టగా, అక్కడి నుంచి సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
అపహరణకు గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇటీవల మిర్చికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో కొంతమంది ముఠాలు చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా పుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మిర్చి నిల్వలను పొలాల్లో లేదా బావుల వద్ద అరబెట్టే రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో పరిసర గ్రామాల రైతుల్లో ఆందోళన నెలకొంది.