మేడారం.. ట్రాఫిక్ నరకం
- టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు!
- మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ
మేడారంలో 'ట్రాఫిక్' నరకం
- టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు!
అక్షరదర్బార్, మేడారం: తెలంగాణ కుంభమేళా, మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సర్కారు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలాయి. కోట్లాది రూపాయల ఖర్చు, హైటెక్ హంగులు, ఏఐ (ఏఐ) నిఘా అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ యంత్రాంగం.. ట్రాఫిక్ నియంత్రణలో ఘోరంగా విఫలమై చేతులెత్తేసింది.
- గంటల కొద్దీ ‘చక్రబంధం’.. నరకప్రాయం ప్రయాణం!
మేడారం వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీ నరకాన్ని తలపిస్తున్నాయి. పస్రా నుంచి మేడారం చేరుకోవడానికి భక్తులకు ఏకంగా 10 గంటల సమయం పడుతుండటం అధికారుల వైఫల్యానికి పరాకాష్ట. పస్రా - తాడ్వాయి మధ్య ఈ స్వల్ప దూరానికే 4 గంటల సమయం పడుతోంది. తాడ్వాయి - మేడారం మధ్య మరో 4 గంటల పాటు వాహనాలు అంగుళం కూడా కదలని పరిస్థితి. మేడారం నుంచి హనుమకొండ చేరుకోవడానికి 11 గంటల సమయం పట్టింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మేడారం నుంచి బయలుదేరిన భక్తులు శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు హనుమకొండలో దిగారు. చిన్నారులు, వృద్ధులు ఆకలి దప్పులతో వాహనాల్లోనే అలమటిస్తుంటే, పోలీస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- ఏఐ అంటే ‘అంతే సంగతులా’?
ఈసారి జాతరలో ట్రాఫిక్ కష్టాలు ఉండవని, ఆధునిక సాంకేతికత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పర్యవేక్షిస్తున్నామని చెప్పిన మాటలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉన్నా.. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో పసిగట్టి క్లియర్ చేయడంలో పోలీస్ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.
- రోడ్లపై రద్దీ.. క్యూలైన్లలో ఖాళీ!
విచిత్రమేమిటంటే, ఒకవైపు కిలోమీటర్ల మేర రోడ్లపై భక్తులు చిక్కుకుపోగా, మేడారంలో క్యూలైన్లు మాత్రం వెలవెలబోతున్నాయి. భక్తులు గమ్యస్థానానికి చేరుకోలేక అడవి బాటలోనే ఆగిపోవడంతో గద్దెల వద్ద రద్దీ తగ్గింది. యంత్రాంగం మధ్య సమన్వయ లోపం భక్తుల పాలిట శాపంగా మారింది.
- నిట్టూరుస్తున్న భక్తులు
"మేము మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామా లేక రోడ్లపై శిక్ష అనుభవించడానికి వచ్చామా?" అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ట్రాఫిక్ క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.