రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.
నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.
ఈఎఫ్టీ విచారణలో బహిర్గతం
అక్షర దర్బార్, శాయంపేట:
రబీ 2024-25 సీజన్లో శాయంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ రైతుల పేరుతో రూ.1.86 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులు మోసపూరితంగా దోచుకున్న ఘటనపై రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ (ఈఎఫ్టీ) చర్యలు చేపట్టింది.
నమ్మదగిన సమాచారం ఆధారంగా, సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈఎఫ్టీ టీమ్-IV సమగ్ర విచారణ చేపట్టింది. శాయంపేట మరియు కాట్రపల్లి గ్రామాల్లోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలు దర్యాప్తులో బయటపడ్డాయి.
మోసానికి నాయకుడు ఎవరు?
ఈ మోసానికి ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఇతను కమలాపూర్ మండలానికి చెందిన చెందిన సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ యజమాని. ఇతను తన కుటుంబసభ్యులు, మధ్యవర్తులు, వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి ఒపీఎంఎస్ లో 12 నకిలీ రైతుల పేర్లు నమోదు చేశాడు. ఈ నకిలీ రైతుల పేరుతో 278 ఎకరాల్లో పంట పండించామని చూపించి, 8,049.6 క్వింటాళ్ల ధాన్యం సరఫరా చేశామని నమోదు చేశారు. కానీ వాస్తవంగా ఒక్క క్వింటా ధాన్యం కూడా కొనుగోలు కాలేదు.
నిందితుల జాబితా:
బండ లలిత – మధ్యవర్తిగా పనిచేసి నకిలీ ఎంట్రీల్లో సహకారం.
వంకుడోత్ చరణ్ – ప్రైవేట్ ట్యాబ్ ఆపరేటర్; వ్యవసాయ అధికారుల లాగిన్ వివరాలు దొంగిలించి అక్రమ లాగిన్.
బి. హైమావతి – ఐకెపి శాయంపేట పీపీసీ ఇన్చార్జ్ అధికారిక ట్యాబ్ను ఇతరులకు ఇచ్చింది.
అనిత – ఐకెపి కాట్రపల్లి పీపీసీ ఇన్చార్జ్ ట్యాబ్ను ఇతరులకు వినియోగానికి ఇచ్చింది.
వ్యవసాయ అధికారులు:
కె. గంగా జమున (ఏఓ)
బి. అర్చన, ఎం. సుప్రియా (ఏఈఓలు) – లాగిన్ వివరాలు పంచుకోవడం, ధృవీకరణలో నిర్లక్ష్యం.
రవాణా కాంట్రాక్టర్: సుధాటి రాజేశ్వర్ రావు – 27 ట్రక్కుల రవాణా చేశామని చూపించి చార్జీలు క్లెయిమ్ చేశాడు. కానీ వాస్తవంగా రవాణా జరగలేదు. నకిలీ ట్రక్ షీట్లు, టోకెన్ బుక్స్ రూపొందించడంలో భాగస్వామి.
మోసానికి గణాంకాలు:
నకిలీ రైతుల సంఖ్య: 12
తప్పుడు భూ సమాచారం: 278 ఎకరాలు
నకిలీ ధాన్యం సరఫరా: 8,049.6 క్వింటాళ్లు
దోచుకున్న మొత్తం: ₹1,86,63,088/-
బోనస్ క్లెయిమ్ (ప్రయత్నం): ₹500 ప్రతి క్వింటాకు
తీసుకున్న చర్యలు:
నకిలీ రైతుల బోనస్ చెల్లింపులు నిలిపివేత.ఒపీఎంఎస్ పోర్టల్ నుండి నకిలీ భూ సమాచారం తొలగింపు.అక్రమంగా పొందిన మొత్తం ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలనే ఆదేశాలు జారీ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆపరేషనల్ ప్రాంతాల్లో కఠిన నియంత్రణలు అమలు చేయాలని అధికారులు హెచ్చరించారు.
దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసుపై హనుమకొండ జిల్లా సివిల్ సప్లైస్ శాఖ పర్యవేక్షణలో, శాయంపేట పోలీస్చే క్రిమినల్ విచారణ కొనసాగుతోంది. ఈ ఘనంగా మోసం వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. నిజమైన రైతులకు నష్టం వాటిల్లకుండా, ప్రజా నిధులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు శాయంపేట ఎస్ఐ జె. పరమేశ్వర్ తెలిపారు.