పేలిన మందుపాతర
- ముగ్గురు పోలీసుల దుర్మరణం
- మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు?
- బీజాపూర్ జిల్లాలో ఘటన
పేలిన మందుపాతర
- ముగ్గురు పోలీసులు దుర్మరణం
- బీజాపూర్ జిల్లాలో ఘటన
అక్షరదర్బార్, వాజేడు: తెలంగాణ- ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దులోని బీజాపూర్ జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో మందు పాతర పేలటంతో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజుల నుంచి తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు జరుపుతున్నారు. ఇప్పటివరకు మావోయిస్టులు అమర్చిన సుమారు 200 మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో లంకపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మందు పాతర పేలడంతో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా ఒక ఎస్సై గాయపడినట్లు సమాచారం. మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు శ్రీధర్, సందీప్, పవణ్ కళ్యాణ్. వీరి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఎస్సై రణధీర్ స్వగ్రామం వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని పైడిపల్లి అని తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఇతన్ని హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మందు పాతర మృతులకు నివాళి అర్పించేందుకు వరంగల్ కు డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు. గతంలో కూడా కర్రెగుట్టపై, పరిసరాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు, ఐఈడీలు పేలిన విషయం తెలిసిందే. లంకపల్లి మందుపాతర పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.