కొడితే మాములుగా ఉండదు.. రేవంత్ సర్కార్కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- నమ్మి ఓటేస్తే మంచి గుణపాఠం లభించింది
- గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా..
- ఇక లాభంలేదు.. ప్రత్యక్ష పోరాటాలే..
- ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ
అక్షరదర్బార్, ఎర్రవెల్లి : రేవంత్ సర్కార్కు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ (శుక్రవారం) జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కోహీర్ , జహీరాబాద్, ఝారసంఘం, మొగుడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం. రాబోయే రోజుల్లో విజయం మనదే. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి అంటూ గులాబీ దళపతి శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రాజెక్టులు పడుకున్నాయి
సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ఎండబెడుతున్నారు. భూములు ధరలు అమాంతం పడిపోతున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ టెండర్లను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది. కరోనాలో కూడా రైతుబంధు ఇచ్చి.. రైతుల కోసం మంచి పథకాలు తెస్తే అంతా గంగలో కలిసిపోయింది. గురుకుల హాస్టల్లో తిండి బాగా లేక.. పిల్లలు అనారోగ్యం బారినపడుతున్నారు. బీఆర్ఎస్ రాజకీయాల కోసం పుట్టింది కాదు. ఇక లాభంలేదు.. ప్రత్యక్ష పోరాటాలే. కాంగ్రెస్ పాలనలో రైతుబంధుకి రాంరాం. దళితబంధుకి జైభీమ్ చెప్పేశారు. తులం బంగారం పథకం గోవిందా. కాంగ్రెస్ పాలనపై అంతటా అసంతృప్తి. అన్నివర్గాలను ముంచిన పార్టీ కాంగ్రెస్. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లైంది. కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దాం. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలుకావడం లేదు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది. అని రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.